ఐఏఎస్ రిజ్వీ వీఆర్ఎస్‌కు ఆమోదం.. CM, CSకు మంత్రి జూపల్లి సంచలన లేఖ

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-23 06:44:21  IST  )

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ (Syed Ali Murtaza Rizvi) స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేశారు.

ఐఏఎస్ రిజ్వీ వీఆర్ఎస్‌కు ఆమోదం.. CM, CSకు మంత్రి జూపల్లి సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ (Syed Ali Murtaza Rizvi) స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేశారు. అయితే, వీఆర్‌ఎస్‌కు ఆయన పెట్టుకొన్న దరఖాస్తును ప్రభుత్వం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నెల 31 నుంచి రిజ్వీ పదవీ విరమణ అమల్లోకి వస్తుందని సీఎస్‌ రామకృష్ణారావు (CS Ramakrishna Rao) బుధవారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఎక్సైజ్ శాఖలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. తాజాగా, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ వీఆర్ఎస్‌కు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొద్దని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్ రామకృష్ణారావుతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశారు.

అయితే, రిజ్వీ తన పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా అక్రమాలకు పాల్పడినట్లు మంత్రి జూపల్లి కష్ణారావు ఆ లేఖలో ప్రస్తావించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. మంత్రిగా తన విధులకు కూడా ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. దీంతో పాటు తన శాఖలో రిజ్వీ చేసిన కొన్ని పనులను మంత్రి సీఎస్‌ రామకృష్ణారావు దృష్టికి తీసుకొచ్చారు. మద్యం బాటిళ్లపై సెక్యూరిటీ కోసం హోలోగ్రామ్ (Hologram) స్టిక్కర్ల కాంట్రాక్టును 11 ఏళ్లు ఒకే కంపెనీకి ఇస్తున్నారని ఆరోపించారు. హోలోగ్రామ్ స్టికర్లను మరింత భద్రతతో, లేబుల్స్ మార్చి టెండర్లు పిలవాలని చెప్పినా కనీసం పట్టించుకోలేదని మళ్లీ పాత వారికే కాంట్రాక్టు కట్టబెట్టారని లేఖలో జూపల్లి ప్రస్తావించారు.

ఇక చిట్టి సృజన్ (Chitti Srujan) కేసులో బకాయిలతో పాటు కాంపౌండింగ్ ఫీజు విషయంలో ఇచ్చిన సూచనలను రిజ్వీ పెడచెవిన పెట్టారని తెలిపారు. క్యాప్రికార్న్ బ్లెండర్స్ (Capricorn Blenders) నుంచి కూడా 6.15 కోట్లు డిమరేజ్ చార్జీలను చట్టవిరుద్ధంగా వసూలుకు సంబంధించిన ఫైల్స్ ఇవ్వడానికి కూడా నిరాకరించారని ఫైర్ అయ్యారు. టీజీబీసీఎల్ ఎండీ (TGBCL MD) అడిగినా వివరాలు ఇవ్వకపోవడం దారుణమని, ఏబీడీ లిమిటెడ్ కంపెనీ (ABD Limited Company) మద్యం ఉత్పత్తి, గరిష్ట అమ్మకం ధర విషయంలో చేసిన జాప్యంతో సర్కార్ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని సీఎం, సీఎస్‌కు రాసిన లేఖలో మంత్రి జూపల్లి వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రిజ్వీ వీఆర్ఎస్‌పై పున: పరిశీలన చేపడుతోందా.. లేక వదిలేస్తుందా వేచి చూడాల్సిందే.

Read More: రాష్ట్రంలో పోలీసులు ఏం పీకుతున్నారు..? మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Next Story